11, ఆగస్టు 2013, ఆదివారం

ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'

పరమ భాగవతోత్తముడైన బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి,
మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! 
జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు
పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని శుకమహర్షి చెప్పినట్లుగా,  అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా, అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి నమస్కరించెను.

*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post_29.html)
 

ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

9, ఆగస్టు 2013, శుక్రవారం

గీతాకల్పతరువు

గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ /
నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి
ప్రవాళాంకితం
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభి
ం మోక్షప్రదం జ్ఞానినామ్ //

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం. వైరాగ్య సహనములే గీతాకల్పతరువు యొక్క చిగురుటాకులు. నానాశాస్త్రములు దాని శాఖలు. శ్రీకృష్ణ పాదపద్మమునందలి పూర్ణభక్తియే దాని పుష్పం. జాతి లింగ ఆశ్రమ భేదములేక యెవ్వరు దానిని భక్తితో ఆశ్రయింతురో వారు తప్పక ముక్తులగుదురు.

ఇటువంటి కల్పతరువును ఏ ఫలం ఆశించి ఆశ్రయిస్తే ఆ ఫలం మాత్రమే సిద్ధిస్తుంది. కామ్యఫలం ఆశిస్తామో, జ్ఞానఫలం ఆశిస్తామో మన అభిమతంపై ఆధారపడి ఉంటుంది.

6, ఆగస్టు 2013, మంగళవారం

"నా ఆ ఆనందం అందరితో ....."


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' కారణముగా మరోసారి (క్రిందటి టపాలో మొదటిసారి తెలుసుకున్నది తెలిపాను) కృష్ణతత్త్వం తెలుసుకోగల్గినందుకు నా ఆనందం మరింత అధికమైంది. "నా ఆ ఆనందం అందరితో" పంచుకోవాలని ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని టపాగా పెడుతున్నాను.

ఉదయం హరిప్రియతో ముచ్చటిస్తూ, ఓ ప్రక్కకు తిరిగి నోటిలో బొటనవ్రేలు పెట్టుకుంటూ ఊ ఊ లు కొడుతున్న శ్రీ మాన్విని చూసి -
అరే, ఈమధ్య బొటనవ్రేలు నోటిలో పెట్టేసుకుంటుంది, ఇప్పుడే దీనిని మాన్పించాలి, అలవాటైతే కష్టం కదా, అయినా పిల్లలు ఎందుకు నోటిలో వ్రేలు పెట్టుకుంటారో ఏమిటో ... అన్న నా మాటలకు నవ్వి, దానికీ ఓ కధ వుంది అని, చెప్పిందిలా -
పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే రాజు తండ్రి నుండే తిన్నగా ప్రభవించాడు. మన శరీరంలో ప్రతి అవయంలో ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉన్నట్లే చేతికి అధిపతిగా ఉన్న ఇంద్రుడు, పాలిచ్చేతల్లి లేనికారణముగా ఆ బిడ్డను నేను పోషిస్తానని వచ్చి, బొటనవ్రేలు ద్వారా అమృతం పిల్లవానికి చేరాలని,  'మాం - దాతా' పిల్లవాని బొటనవ్రేలును పిల్లవాని నోట్లో పెట్టాడట. అందుకేనేమో, చాలామంది పిల్లలు బొటనవ్రేలును చీకుతుంటారని అంది.
ఓహో ... కధ బాగుంది కానీ; మరి శ్రీకృష్ణుడు వటపత్రం పై శయనిస్తూ కాలిబొటనవ్రేలును నోట్లో పెట్టుకుంటూ ఓ లీలను ప్రదర్శిస్తాడు కదా, దానిలో ఏమైనా అంతరార్ధం వుందా అన్న నాప్రశ్నకు -
ఆ ... పరమాత్మ లీలలకు పరమార్ధం తప్పకుండా ఉంటుంది. మనల్ని మాయనుండి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదించే దివ్యరూపమిదని, తాతయ్యగారు చెప్పింది లీలగా జ్ఞాపకం ఉంది. 

                                                    
శ్రీకృష్ణపరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ముందుగా వటపత్రంపైనే ఎందుకు శయనించాడో చెప్పారు. జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో, చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. మిగతా మొక్కల్ని నాటినట్ట్లుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. ఇది స్వయంభువంగా వెలుస్తుంది. దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్లగుంపులా విస్తారముగా ఉంటుంది. ఈ చెట్టును చూస్తే ఈశ్వరసాదృశ్యం తేటతెల్లమౌతుంది. ఎలాగంటే అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని, ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు. 
అదియును కాక,  గోవు యొక్క సారం నవనీతం అయినట్లుగా, దానిని కృష్ణపరమాత్మ గ్రహించినట్లుగా వెన్నదొంగతనంలో కృష్ణతత్త్వం అర్ధం చేసుకున్నాం కదా.  చిట్టచివర వచ్చే నవనీతదశలో మాత్రమే కాదు,వటపత్రంపై ఉండండం ద్వారా,  ప్రాధమికదశయైన పత్రదశలోనూ (ఏ చెట్టుకైనా ముందు ఆకులే కదా చిగురిస్తాయి) తానున్నాని తెలియజేస్తున్నాడు. అలానే, మన శరీరంలో ఇడానాడి (దీనినే చంద్రనాడి అని అంటారు) ఎడమవైపున ఉంటుంది. ఇది జీవస్థానంకు, భౌతికప్రవృత్తికి సంకేతం. యోగులు ఈ నాడి నుండే అమృతస్రావాన్ని అనుభవిస్తారని, కృష్ణుడు తన ఎడమకాలి బొటనవ్రేలు నోటిలో పెట్టుకోవడం ద్వారా ఆ యోగస్థితిని సూచించాడని అంటారు. అలానే ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు. ఈ లీల ద్వారా తాను అమృతం త్రాగుతున్నట్లు కనబడినా, అతడు నిజంగా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తూ జనన మరణ ప్రవాహమునుండి మనల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అందువల్లనే "ముకుంద", ముక్తిప్రదాత అని స్తుతింపబడుతున్నాడు. అంతే కాకుండా బాలరూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా పిల్లల హృదయంలాంటి హృదయాన్ని కల్గియుండి, మనస్సును పాలమాదిరిగా స్వచ్ఛంగా ఉంచుకుంటే, మన మనస్సనే పాలసముద్రంపై భక్తిత్వం అనే వటపత్రం తేలగా, దానిపై క్షీరాబ్ధిసాయిలా శయనిస్తూ మనల్ని తనలో లీనం చేసుకుంటాడన్న సంకేతముందని తనకి జ్ఞాపకం వున్నంతవరకు వటపత్రశాయి గురించి వివరించిన
నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
తన చిరుచేష్టల ద్వారా ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.

కరారవిందేన పదారవిందం
ముఖారేవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
వటపత్రంపై శాయనిస్తున్న, పద్మంవంటి కాలిబొటనవ్రేలును, పద్మంవంటి చేతితో పట్టుకొని, పద్మంవంటి ముఖంలో పెట్టుకున్న ముకుందున్ని మనసార స్మరిస్తున్నాను.