9, డిసెంబర్ 2016, శుక్రవారం

"దత్తోహం"

బ్రహ్మ మానసపుత్రులైన సప్తర్షులలో ఒకరు అత్రి మహర్షి. ఈయన విశేష తపఃసంపన్నుడు. అత్రి అంటే "ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్యో జీవన్ముక్తో కశ్చిన్మహర్షి:" ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆధిభౌతికములనే మూడు తాపత్రయములు లేనివాడు. సత్త్వ, రజో, తమోగుణాలు, గ్రంధిత్రయాలు లేనివాడు అత్రి.


కర్దమ ప్రజాపతి ద్వితీయ పుత్రిక అనసూయాదేవి. "యస్యాం నవిద్యతే అసూయ సా అనసూయ" ఏ స్త్రీయందు అసూయ వుండదో ఆమె అనసూయ. అనసూయ అంటే అసూయను వీడిన తత్త్వం. పరిశుద్ధంగా వుండే తత్త్వం.

అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ. ఈమె మహాసాధ్వి. ఈమె పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ నారదులవారివలన విస్తరించగా, లక్ష్మి, పార్వతి, సరస్వతులు ఒకింత అసూయతో (ఈ మువ్వురమ్మలకు అసూయ ఏమిటి? వారు శక్తి స్వరూపులు కదా ... అని నాకు ఈ కధ చెప్తున్న మా తాతయ్యగారిని నేనడగగా, తల్లీ! కైకేయి ఆ వరాలు  కోరకపోతే రాముని అవతార కారణం సఫలం కాదు, అలాగే మానవాళిని జ్ఞానమార్గంలో తరింపజేయలన్న తలపుతో శ్రీ దత్తుని అవతారం లోకోద్ధారణకు అవశ్యం కాబట్టి ఆ అమ్మవార్లు మానవాళి శ్రేయస్సుకై అలా స్పందించారని చెప్పారు)



ఆ మువ్వురమ్మలు అనసూయను పరీక్షింపదలచి, తమ భర్తలను పంపగా, ఆ త్రిమూర్తులు ఓ మధ్యాహ్న వేళ, మునివేషాలతో అత్రిమహర్షి ఇంట్లోలేని సమయాన అతిథులుగా వచ్చి,  భోజనాల సమయంలో ఆమెను వివస్త్రయై వడ్డించమనగా, వారిని పసిబిడ్డలుగా మార్చేసి, పుత్రవాత్సల్యంతో తన స్తన్యపానము చేయిస్తుంది. పిమ్మట ఇంటికి వచ్చిన అత్రిమహర్షి దివ్యదృష్టితో సత్యాన్ని గ్రహించడం, అటుపై కొంతకాలానికి మువ్వురమ్మలు  తమ భర్తల స్థితిని గతిని తెలుసుకొని, 


అత్రిమహర్షి ఇంటికి అరుదెంచి పతిభిక్ష పెట్టమని అర్ధించగా, వారి కోరిక మేరకు అత్రిమహర్షి త్రిమూర్తులను ప్రసాదించడం,  ఆపై కొంతకాలమునకు మాండవ్యుడనే మహర్షి, మరునాటి సూర్యోదయంలోగా మరణిస్తావని సుమతి అనే పతివ్రత భర్తను శపించడం, ఆ పతివ్రత సూర్యోదయంను ఆపేయడంతో, ఆ అకాల ప్రళయంను నిలువరించమని దేవతలు అనసూయను వేడుకోగా, ఆమె సుమతికి నచ్చజెప్పి, సూర్యోదయంను చేయించి, విగతప్రాణుడైన సుమతి భర్తను బ్రతికించడం, 









ఈ అద్భుతకార్యంకు సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమనగా, తనకు ఇతరత్రా కోరికలు లేవని, భర్తకు పూర్వమిచ్చిన వరమును పూర్తిచేయవలసిందిగా కోరిన కొద్దికాలానికి మువ్వురు అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ఆ పుణ్యదంపతుల తపఃఫలంగా పుత్రులై ప్రభవించినట్లు  పురణాల కధనం.


                                                                     దత్తాత్రేయుడు

శ్రీ దత్తాత్రేయుడు మూర్తిత్రయాత్మక స్వరూపుడు. (మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం.
స్థూల సూక్ష్మ కారణము లనెడు దేహత్రయమును దత్తముజేసినవాడు (దత్తమనగా ఇవ్వబడిన లేక త్యజింపబడిన) దత్తాత్రేయుడు. దేహత్రయాతీత సాక్షిచైతన్య స్వరూపుడు.
జాగ్రత్ స్వప్న సుషుప్తులనెడి అవస్థాత్రయం లేనివాడు దత్తాత్రయుడు.
సత్వ, రజో, తమో గుణాలు మూడింటికీ అతీతుడైనవాడు దత్తాత్రేయుడు.
అకార ఉకార మకారములనెడు మూడుమాత్రలకు మూడక్షరములకు మూలస్వరూపుడై, త్రిమూర్తులకు పరమై, సత్యజ్ఞానానందమూర్తియైన శ్రీ దత్తాత్రేయుడు షోడశ కళా పరిపూర్ణుడైన పరబ్రహ్మతత్త్వంకు ప్రతీక.

దశావతారాలలో దత్తాత్రేయుని అవతారం లేనప్పటికీ త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తుడిది అత్యంత విశిష్ట జ్ఞానావతారం. భాగవతంలో పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో ఒకటి దత్తావతారం.  సాధారణంగా భగవంతుడు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణకై అవతరిస్తుంటాడు. అటులనే ఈ దత్తావతారంలో జ్ఞానత్వం ద్వారా మనలో ఉన్న దుష్ట సంస్కారాలను, అజ్ఞానమనే అసురత్వాన్ని సంహరించడం జరిగింది.   భగవానుని అనేక అవతారములు, వారు అవతరించడానికి కారణమైన కార్యము పూర్తయ్యాక తిరిగి అంతర్ధానం అయ్యాయి. కానీ, శ్రీదత్తునిది నిత్యావతారం.

శ్రీ దత్తుడు గురువు, దైవమూ కూడా. అందుకే ఆయనను 'గురుదేవదత్త'గా కొలుస్తారు. స్మరించిన మాత్రమునే సంతుష్టుడై సంరక్షిస్తాడని 'స్మర్తృగామి' అని కీర్తిస్తారు. తత్త్వ జ్ఞానాభిలాషులకు "యోగి"లా, ఇతరులకు "బోగి"లా దర్శనమిచ్చే శ్రీ దత్తుడు, ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత. జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే భక్తసులభుడు.

యోగమే శ్రీ దత్తుని మార్గం.
నిస్సంగత్వమే శ్రీ దత్తుని ఉపదేశం.
జ్ఞానమే శ్రీదత్తుని ఉపాసన.










లోకంలోని సర్వులకు జ్ఞానమార్గంలో తరింప చేయగోరి, అనసూయమాత తన పాతివ్రత్య భక్తితో, 
అత్రి మహర్షి తన తపోశక్తితో, 
ఆదిగురువుగా, తనని తాను లోకాలకు దత్తం చేసుకున్న శ్రీ దత్త భగవాన్ అవతరించినట్లు చేసిన ఈ పుణ్యదంపతులకు ముందుగా నమస్కరిస్తూ ...


                                                        
            
శ్రీ దత్తాత్రేయ స్తుతి 
                                      అనసూయాత్రి సంభవం అఖండ జ్ఞాన వైభవం
                                      అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే ||

                                      త్రిగుణ రహితం దేవం త్రిమూర్తి స్వరూపం విభుం 
                                      సద్గురుం కరుణామయం దత్తాత్రేయమహం భజే || 
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ: 

దత్త ఆరాధకులు, ఆధ్యాత్మిక సాధకులు "దత్తోహం" అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా, అవధూతలుగా మారతారని ప్రతీతి.


మార్గశిర శుక్ల పూర్ణిమ "శ్రీ దత్త జయంతి". సందర్భంగా ఈ దత్త స్మరణ ... 
                                             
                                                                      "దత్తోహం" 

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎందుకు???

'సర్వం ఖల్విదం బ్రహ్మ' సర్వమూ బ్రహ్మమే అయినప్పుడు, అందరూ ఆత్మస్వరూపులే అయితే ... ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు? ఆహారనియమాలెందుకు? పూజలెందుకు? ధ్యానమెందుకు? నియమనిష్టలెందుకు? శాస్త్ర పఠనమెందుకు? సత్సంగాలెందుకు?
పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది. ఆ క్షణంలో, తనలో ఎన్నో ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్లయింది. ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా, ఆనాడు నేను ఎవర్నీ అడగలేకపోయాను. అయితేనేం, భగవంతుని అనుగ్రహం వలన కాలక్రమేణా పుస్తక పఠనం వలన నా సందేహాలు తీర్చుకున్నాను. 

మనది పరోక్ష జ్ఞానం. అంటే మన ఋషులు, మహర్షులు, పూర్విజులు చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకొన్నది. దానినే ప్రత్యక్షజ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనలు తల్లీ. 
దీపం గురించి తెలిసినంతమాత్రమున చీకటి పోతుందా? అన్నం గురించి మాట్లాడితే ఆకలి, నీరు గురించి మాట్లాడితే దాహం తీరుతాయా? అలానే వినడంవలన, తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదు. భావనమయప్రజ్ఞ (అనుభవపూర్వకంగా తెలుసుకోవడం) అన్నింటికన్నా ముఖ్యం. 


మనస్సును జయించడం, మనస్సుకు అతీతులమవడం, చెడుగుణాలు తొలగించుకోవడం, మనలోపల ప్రక్షాళన జరగడం, సంపూర్ణంగా జీవించడం, అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఆనందదాయకంగా జీవించడం, పరమ గమ్యంకు చేరడం, మానవజన్మకు సార్ధకత చేకూరడం ... ఇత్యాదులన్నీ పై సాధనల వల్లే సాధ్యం. 

మహర్షి, సద్గురు శ్రీ మలయాళస్వాములవారు ఇటువంటి ప్రశ్నలు అడిగిన ఓ వ్యక్తికి చక్కటి సమాధానమిచ్చారు. ఆ సమాధానం నా మనస్సులో ముద్రించుకుపోయింది. నన్ను ప్రభావితం చేసిన ఆ సమాధానం యధాతధంగా - 
"వ్యవసాయకుడు తన క్షేత్రము నందున్న రక్కీస, చిల్లకంప మొదలగు కంటకముల పాదులను తొలగించి, సంపూర్ణంగా కలుపును దుక్కి దున్నుటచే హరింపజేసి పైరుబీజములను ఎట్లు జల్లునో, అట్లే సాధకుడు తన హృదయాంతరాళమున నున్న దుఃఖమయ రాక్షసగుణములనన్నింటిని సంపూర్తిగా తొలగించి యందు దైవగుణబీజములను జల్లి, పెంచి పోషించినచో దైవత్వమను పంటయే పండితీరును. ఎండాకాలంలో కలుపు ఏమియూ కనబడకపోయినను, బీజరూపమున దాగియుండి వర్షం కురియగానే యెట్లు మొలకెత్తునో, అట్లే అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి, సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును. వాటిని పై సాధనల ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో, తప్పక విజయుడై, విశుద్ధ హృదయుడై దైవత్వంను పొందగలడు. గీతలో దైవాసుర సంపద్విభాగయోగమందు శ్రీకృష్ణభగవానుడు జెప్పినట్లు సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో, అసురభాగమెంతగలదో పరిశోధించి, అనుక్షణమును అసురగుణ నిర్మూలమునకును, దైవగుణ ప్రతిష్ఠకొరకును ప్రయత్నశీలురై యుండవలయును". 

పై వివరణే ఆ అమ్మాయికి చెప్పగా - ఆంటీ, బాగుంది మీరు చెప్పింది. అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు? ఆ అమ్మాయి ఈ ప్రశ్న వినగానే ఒకింత ఆశ్చర్యం. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను మా తాతయ్యగారిని ఇదే ప్రశ్న అడిగాను. దానికి మా తాతయ్యగారు ఇలా చెప్పారు -    
మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః 
నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః 
భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః 
ఏతేషాం ఫలమస్తి కిం న హి న హి జ్ఞానం పరం కారణమ్  

గంగయందే పుట్టిపెరిగిన జలచరం లన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించియు వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను, ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. అలానే కాసేపు ధ్యానం, ఆహారానియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను పట్టుదలతో అనన్య దైవభక్తితో సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం... ఈ రీతిలో తాతయ్యగారు చెప్పింది ఆ అమ్మాయికి చెప్తూ ఎప్పటిలా మంచివిషయాలను 'స్మరణ'లో పదిలపరుచుకుంటున్నాను.    

                             మన మతి ఎలా ఉంటుందో, మన గతి అలాగే ఉంటుంది. 
                                       సమ్మతితో వుండు - సద్గతి పొందు    

7, ఆగస్టు 2016, ఆదివారం

ప్రియమైన నువ్వూ,

నేడు నేనందుకున్న చిన్ననాటి స్నేహితురాలి, ఈ లేఖ నా మదిని తాకగా, యధాతధంగా, స్మరణలో పదిలపరుచుకుంటున్నానిలా -
                                               



ప్రియమైన నువ్వూ,
కుశలమే కదా?
ప్రతీసారి నీ స్పురణ, స్మరణ మదిలో మెదలగా, వెల్లువెత్తే స్నేహానురాగంతో హృదిలో కదలాడే చక్కటి చిక్కటి భావాలను అక్షరీకరించి ఆనందంతో స్నేహాదినోత్సపు శుభాకాంక్షలంటూ ఆ లేఖను నీ దరి చేర్చేదానిని. కానీ, నేడు... బాధతో బరువైన మది భారంగా మూలుగుతుంటే, ఎప్పటిలా లేఖ వ్రాయలేకపోతున్నా.
ఏమే భారతీ,
నీకు గుర్తుందా... మన చిన్ననాటి రోజులు? అప్పటివారు పగలంతా వారి వారి వృత్తులు చేసుకొని, సాయంత్రం అయ్యేసరికి, మర్రిచెట్టు చప్టా దగ్గరో, తాతయ్యగారి ఇంటి చీడి దగ్గరో చేరి, కష్టసుఖాలు చెప్పుకునేవారు, సమస్యలకు సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు, ఒకరుకు ఒకరు పరస్పరం సహకరించుకునేవారు, దైవపర విషయాలు చర్చించుకునేవారు, ఏ చింత లేకుండా హాయిగా వుండేవారు. అప్పుడున్న ఐఖ్యత, అవగాహన, అరమరికలు లేని మనుగడలు ఇప్పుడు లేవేమి?
పాఠశాలలు, కళాశాలలు పెరిగేకొద్దీ జ్ఞానం పెరగాలి, రక్షకభటులు పెరిగేకొద్దీ నేరాలు తగ్గాలి, వైద్యులు పెరిగేకొద్దీ రోగాలు తగ్గాలి, సుఖ సాధనాలు పెరిగేకొద్దీ సంతోషం పెరగాలి... కానీ, అలా అవడంలేదెందుకని?
అప్పుడూ కష్టాలు, రోగాలు, తగాదాలుండేవి కానీ, ఇప్పుడంతలా కాదు కదా.
సిరిసంపదలు పెరిగినా సుఖం లేదు. తినడానికి కావాల్సినవన్నీ వున్నా, తినే ప్రాప్తం లేదు. నాగరికత పెరిగినా, సంస్కారం కుంటుపడింది. చదువులు పెరిగినా, సద్గుణాలు లోపిస్తున్నాయి. భౌతిక సంపద వున్నా, నైతిక సంపద లేకుంది. సమస్తమూ వున్నా శాంతి లేదు. అన్నీ వున్నా ఆనందం లేదు... నీతి లేదు, నిజాయితీ లేదు, ఎవర్నీ నమ్మెందుకు లేదు... ఎందుకంటావ్?
భారతీ,
బంధుత్వాలకు అతీతమైన బంధం 'స్నేహం'. నమ్మకంకు మరోపేరు స్నేహం. ఆత్మీయ మిత్రులు ఆత్మ సములు. బంధుత్వాలన్నీ భగవంతుని సంకల్పమైతే, స్నేహ బంధం హృదయజనితం. నువ్వూ, నేను ఒక్కటేనన్న ఏకాత్మభావన... ఇలా మైత్రి మాధుర్యపు నిర్వచనాలు ఎన్నెన్నో స్నేహ మనోపొదిలో. 
కానీ, అందరు మిత్రులుకు ఇది వర్తించదు రా. అన్ని స్నేహాలు ఒకేలా వుండవు. కొన్ని స్నేహాలు మాత్రమే అంత అద్భుతంగా వుంటాయి. లాలసతో, లాలిత్యంతో, లలితంగా, ఆత్మీయతతో, ఆర్ద్రతతో, ఆర్తితో అనుబంధాలను అల్లితే అది ఆనందభరితంగా ఆహ్లాదమయంగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఒకరికి ఒకరం ఇచ్చిపుచ్చుకునే స్నేహం అపార్ధాలతో భారంగా దుఃఖమయంగా మారితే ఆ ఆవేదన ఎలాగుంటుందో రుచి చూశా కొన్ని నా అనుభవాలతో. 
వారికి అనుకూలంగా వున్నంతవరకు ... స్నేహాన్ని పంచుకోవడం, పెంచుకోవడం ... లేకుంటే తులనాడడం, త్రుంచుకోవడం... ఇదా స్నేహ బంధానికి ఉన్న విలువ? కూరిమి గల దినములలో ... గుర్తుందా చిన్నప్పుడు మనం వల్లెవేసిన పద్యం? అది నిజం రా. స్పష్టత లేని వారి భావాలను సమర్ధించకపోతే, సరిచేయాలనుకుంటే ... అంతవరకూ నీవే నా ప్రాణమనేవారు మన ఒప్పులనే తప్పులంటూ, తమ లోపాలను సరిదిద్దుకోక, మనలో లోపాలను బూతద్దంలో వెతికిమరి పరుషమైన మాటలతో వేదనకు గురిచేస్తారే. మొన్నటికి మొన్నదే ఈ నా అనుభవం. నీ సాంగత్యంలో అలవడిన ఆధ్యాత్మిక పుస్తక సాంగత్యం వలన వారి పోకడను భరించి మౌనమయినను, మనోబాధను భరించలేకున్నాను. నా ఈ బాధను నీకు చెప్పాలని కాల్ చేద్దామనుకున్నా. 
కానీ, ఎవరైనా మాట్లాడుతుంటే వారి గుణం మాట్లాడుతున్నదని ఊరుకో, వారి వారి స్వభావరీత్యా, సంస్కారరీత్యా వారి వారి మాటలుంటాయి. ఆ మాటలను పట్టించుకోకు. విషయాలను ధ్యానించకు, భగవంతుణ్ణి ధ్యానించు. భగవంతునితో చెలిమి చేయు అన్న అంతరంగ ప్రబోధంతో నీకు ఫోన్ చేయక ఆగిపోయి, ఆనాటి సత్సంగంకు వెళ్లాను. అన్యమనష్కంగా ఉన్న నాతో ఏమైందండీ, అలా వున్నారని అడిగిన సులోచన(సత్సంగ నిర్వాహుకురాలు)గారితో దాచలేక పంచుకున్నాను నా బాధను. అంతా విన్న తను, పట్టించుకోకండి యిలాంటివి. పరమాత్మ తనవైపుకు తిప్పుకోవటానికి సాధకులకు అనేక క్లేశాలను, పరాభవాలను కల్పించి తనను స్మరించుకునేలా చేస్తాడు. ఇలా జరిగిందేమిటని కలత పడకండి, అన్నీ మనల్నీ పవిత్రుణ్ణి చేయడానికే అని విశ్వసించండి. ఆధ్యాత్మిక జీవనంలో రీజన్ కన్నా విశ్వసమే ముఖ్యం. వారిని క్షమించి ఎప్పటిలా ఉండండీ అని అన్నారు. 
 'క్షమ' అనగానే నీవే గుర్తుకొచ్చావు, ఒకసారి - సమర్ధులై యుండి కూడా క్షమించువారు పుణ్యాత్ములన్న విదురనీతి గురించి వివరిస్తూ ... 
ఎవరైనా దుఃఖం కలిగించినప్పుడు కోపగించక, ప్రతీకార బుద్ధితో అపకారం చేయక, నిందించక, వారి మాటలను మననం చేసుకుంటూ నొవ్వక, నొప్పించక, శాంతంగా యుండుటయే క్షమాగుణం... అని లోగడ నీవన్న మాటలు గుర్తుకొచ్చాయి. అప్పుడే కదా, నేనన్నాను -
కానీ, మనకంటూ ఓ స్వాభిమానముంటుంది, క్షమించేవారిని సహించేవారిని చూసి లోకులు అసమర్ధులనుకుంటారు, మరో రెండు మాటలని పరిహాసం చేస్తారు, మాటిమాటికి అవమానిస్తారని నేనంటే -
క్షమాతత్వం దైవగుణం, క్షమించటం అంటే పరాభవం, పరాజయం పొందడం కాదు, క్షమించి మౌనమవ్వడం పలాయనం కాదు, బలహీన పడడం కాదు, అదో సద్గుణం, ఉత్తమ సంస్కారం ... క్షమాశీలత అసమర్ధత కాదు, అది ఉత్తమ వ్యక్తిత్వం. మెచ్చాల్సింది లోకులు కాదు, లోకేశ్వరుడు... అంటూ ఓ నదిలో గురుశిష్యులు స్నానమాచరిస్తున్నప్పుడు కొట్టుకుపోతున్న ఓ తేలుని రక్షించాలని గురువుగారు పదేపదే ప్రయత్నించడం, పదేపదే ఆ తేలు కుట్టడం... ఇదంతా చూస్తున్న శిష్యుడు, ఆ తేలుని వదిలేయక, రక్షించి కుట్టించుకోవడమెందుకని అడగగా, కుట్టడం దాని నైజం, దానికి మంచి చేయాలనుకోవడం, రక్షించడం నా నైజం. దాని సహజగుణమును అది ఒదులుకోనప్పుడు నేనెందుకు నా గుణాన్ని వదులుకోవాలి? దాని స్వభావము దానిది, నాది నాదే ... అన్న కధ చెప్పి, 
ప్రాపంచిక స్మరణంలో మునిగి పరమేశ్వరుని స్మరణను మనం ఆపేసినా, భగవంతుని అనుగ్రహం ఆగిపోతుందా? ఊహు... 
ప్రాపంచికత నుండి పారమార్ధిక పధం పట్టేంతవరకు, అనురక్తి లోంచి విరక్తిలోకి వచ్చేంతవరకు ఎన్నెన్నో రుచి చూపిస్తాడు. మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటనలోనూ ఒక సందేశముంటుంది. వారు వారి గుణమును పట్టించుకోకు, పట్టించుకోవాల్సింది పట్టుకొని, మిగిలినవి పట్టి పట్టనట్లు సాగిపో అన్న తాతయ్యగారి మాటలు గుర్తుచేసిన ఆనాటి మన ఇద్దరి సంభాషణ జ్ఞప్తికొచ్చి మనస్సు ఒకింత కుదుటపడిన ఏదో మూలన చిరువేదన. 
అలాగని స్నేహితులందరూ ఇలానే ఉంటారని లేదు. మంచి మిత్రులూ వున్నారు... వారందరికీ నా వందనములు. 
ఆ రాత్రి నిద్రపట్టక, ఏమిటీ జీవితం, ఏమిటీ అనుబంధాలు, ఎందుకిన్ని అవరోధాలు ... అని నాలో నేను సంఘర్షించుకుంటున్న సమయంలో ప్రక్కనే ఉన్న ఫోన్ నుండి వాట్స్ అప్ మెసేజ్ వచ్చినట్లు సూచించే చిరు సడి.

"సౌశీల్యత పరుష పదాల్లో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది,  స్నేహం అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనస్సులో ఉంది..." 
"మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం". 
"రాయి దెబ్బతిన్న తర్వాతే విగ్రహామౌతుంది. మట్టిని కాల్చిన తర్వాతే కుండ అవుతుంది. బంగారాన్ని కాల్చి కరిగించాకే ఆభరణమౌతుంది. ఎన్నో అవరోధాలు అధిగమిస్తేనేగానీ, విజయపధం పట్టలేం".  శుభరాత్రి అంటూ నీవు పంపిన సందేశాలు ... నా మానసిక స్థితికి తగ్గ సందేశాలు ...  సమాధానం దొరికి నాలో సంఘర్షణ సమసిపోయింది. మనసిప్పి చెప్పకపోయినా, మనసెరిగిన మిత్రురాలువనిపించుకున్నావే.

అంతలోనే మరల నీ నుండి ఈ మెసేజెస్ -
                                               



                                        

సరైన దారి చూపే మార్గదర్శకురాలిలా నా మార్గ నిర్దేశం చేసే గురువులా... చీకటి నుండి వెలుతురు వైపు నడిపిస్తూ ...
ఇప్పుడు చెప్పనా ...
స్నేహానికి సరైన నిర్వచనం .. 

అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ ... 

వుండనా మరి, 
ప్రేమతో, 
నీ శైలూ. 

25, జులై 2016, సోమవారం

సనత్సుజాతీయం (చివరి భాగం)



పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు, కోపమూ, మొహమూ, పొరపాట్లు కారణంగా మృత్యువు వుండుననియు, తన మృత్యువుకు తానే కారణుడనియు, ఇంద్రియములకు బద్ధులైనవారు జన్మ పరంపరలలో చిక్కుకుంటున్నారనియు, అంతర్యామి యొక్క అస్తిత్వమునే సర్వత్రా దర్శించువారు అమృతత్త్వం అనుభవించెదరనియు చెప్తూ...  సుకర్మ దుష్కర్మలను వివరిస్తూ, ఫలాపేక్షతో పుణ్యకర్మలు చేసినా దుఃఖభాజనులగుదురనియు, పాపపుణ్యాలకు అతీతంగా వుండి ఆత్మనిష్ఠలో ఉన్నవారు బద్ధులు కారనియు...  సనత్సుజాతులవారు వివరించినదంతా విన్న ద్రుతరాష్ట్రుడు ఇలా ప్రశ్నిస్తాడు -
మహామునీ! ధర్మాన్ని ఆచరించకపోవడం వలన ధర్మం దెబ్బతింటుందా? అధర్మం ఆచరిస్తే ఆ ఫలితం మనం అనుభవింప వలసి వస్తుందా? ధర్మం గొప్పదా? అధర్మం గొప్పదా? అని ప్రశ్నించగా,

ధర్మాధర్మాలు రెండూ మనలోనే ఉన్నాయి. ఆచరించటం ఏది ఆచరిస్తావో దానిబట్టి ఫలితముంటుంది. కర్మాచరణం వలన మానవుడు ఉద్ధరింపబడతాడు. సత్కర్మ ఆచరిస్తే సత్కర్మఫలమైనటువంటి స్వర్గం అనబడేటువంటి ఒక స్థితి వస్తుంది,  అంటే అమృతత్త్వం వస్తుంది. దుష్కర్మ ఆచరిస్తే దుష్కర్మ ఫలంగా నరకం అని చెప్పబడేటువంటి ఒకానొక పాపఫలం సంక్రమిస్తుంది, అంటే అహంతో జీవించడం. ఈ ధర్మ ధర్మాల కర్మాచరణం వలనే జ్ఞానం పొందటం, అజ్ఞానం పొందటం వుంటుంది. సత్కర్మాచరణ చేసినట్లయితే, క్రమేణా మనకి, మనస్సుకి వివేకమొస్తుంది, తద్వారా సత్ జ్ఞానం కల్గుతుంది, తద్వారా ఆత్మ సాక్షత్కార కాంక్ష కల్గుతుంది, అది కలిగినందువలన ఆత్మ యందు మనస్సు నిశ్చలత పొందడానికి కావల్సిన సాధనా తృష్ణ మనలో వస్తుంది, అది రావడం వలన కర్తృత్వభావన వీడి ప్రతిఫలాపేక్ష లేకుండగ భగవదర్పణ చేయడం వలన అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్త్వమంటే ఆత్మ నిష్ఠతో అందర్నీ ఆత్మస్వరూపులుగా భావిస్తూ విశ్వజనీయమైన ప్రేమతో దివ్యజీవనం గడపడం.

ఏ మంచిపనయినాసరే ఆ పనులు మంచివని తెలుసుకున్నంత మాత్రమున ఉపయోగం లేదయ్యా,  ఆచరిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అని సనత్సుజాతులవారు చెప్పగా,

దృతరాష్ట్రుడు మరల 'ఈ ప్రపంచంలో ధర్మమే ఎక్కువ బలము గలదై పాపాన్ని ఓడిస్తుందా? లేక పాపమే ధర్మాన్ని ఓడిస్తుందా?' అని ప్రశ్నించగా -

రాజా! నీ దృష్టిలో ధర్మా ధర్మములు రెండూ సమాన బలముగలవి కావచ్చును. కానీ నీకే తెలుస్తుంది ... ధర్మ మార్గమున అధర్మాన్ని జయించినవారు ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. అలా కాక, అధర్మ మార్గమున ధర్మాన్ని జయించినప్పుడు అశాంతికి గురై లోలోన పరితాపంతో జీవిస్తాడు. కాబట్టి రెండింటికి ఫలం ఎలా ఉందో, దాన్నిబట్టి ఏది బలీయమో నీవే యోచించి తెలుసుకో. ఓ దృతరాష్ట్రా! పుణ్యపాపాలకు అతీతంగా, కర్మఫలాన్ని అపేక్షింపక, కర్మయోగిగా జీవిస్తూ బ్రహ్మానంద స్వరూపులైనవారు అమృతత్త్వాన్ని పొందుతారు, అంటే ధర్మాచరణం చేత, పుణ్యాన్ని లెక్కచేయకుండా, పాపాన్ని క్షాళనం చేసుకొని పరిశుద్ధులైనట్టివారు, నిత్యమూ, శాశ్వతమూ, సత్యమూ అయినటువంటి పరమాత్మ స్వరూపమయినట్టి ధ్యానంలో అమృతత్త్వంను పొందుతారు.
అని సనత్సుజాతులవారు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు -
ఆత్మను దర్శనం చేయకుండా, వ్యక్తులను దర్శనంచేసి, పరోపకారం చేసినా ఒకటే, పరాపకారం చేసినా ఒకటే. పరోపకారం ఎప్పుడు చేసినా 'నిర్లింగమచలం శుద్ధం' ... ఎవరికైతే చేస్తున్నారో వాళ్లలో ఉన్న పరిశుద్ధమైన పరబ్రహ్మమును చూడాలే తప్ప, వారు ఏ కులం, గోత్రం, దుర్మార్గుడా, ఎలాంటివాడు అని చూడకూడదయ్యా దృతరాష్ట్రా!

యోన్యథానన్త మాత్మానం
అన్యథా ప్రతిపద్యతే
కింతేన నకృతం పాపం
చోరేణాత్మాపహారిణా

అనంతమయినట్టి పరమాత్మ ఒకే విధంగా అందరిలోనూ ఉన్నను, మరియొక విధంగా ప్రతిపాదనం చేసుకొని, వీరు మావాళ్లు, వీరు పరాయివాళ్ళు అన్న భావన చేసుకున్నవారు ఏ సత్కర్మాచరణం చేసిన అది పాపమే అవుతుందయ్యా ...

జ్ఞాని మానుషమైన సంపద అంటే మనిషిచేత సృజింపబడ్డ సంపదలను నమ్మక, దైవీ సంపదల మీద నమ్మకముంచి లోకహిత కాముకుడై, నిశ్చలుడై ఉంటాడయ్యా. ఎవరు పొగిడినా తెగడినా, అది అలా మాట్లాడినవారి స్వభావలక్షణంగా ఉన్నట్టిమాటగా భావించి 'లోక స్వభావవృత్తిర్హి' లోకస్వభావ ప్రవృత్తి ఇంతేనని తెలుసుకొని ఊరుకుంటాడేగాని పట్టించుకోడయ్యా. తనకి అన్వయించుకొని బాధపడడు, బదులియ్యడు.

మోక్షమనే మార్గంలో వెళుతున్నవానికి బహు దారులున్నాయి నాయనా... 'సత్యార్జవే హ్రీర్దమ శౌచవిద్యాహః' అంటే సత్యవాక్కు, ఋజు ప్రవర్తనం, లజ్జించటం, దమం, శౌచం, విద్యా... అనే దారులున్నాయి.
సత్యవాజ్మియమం మొదటి దారి అంటే మొదటి గుణం. సత్ప్రవర్తనం రెండో గుణం, చేయకూడని పనులు చేయడానికి లజ్జిపడటం మూడో గుణం, ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకునే నాల్గవ గుణం, బహి (శారీరక) శౌచం, అంతశ్శౌచం ఐదవ గుణం, హితమైన పనులుచేస్తూ, అందరిలో అంతర్యామిని చూసే విద్య ఆరవ గుణం. 'షణ్మానమోహ ప్రతిబన్ధకాని' ఈ అరున్నూ మానాభిమానములు మోహంను తొలగించేసి,మోక్షానికి వెళ్లేదారిని ఇస్తాయి రాజా, వీటిని ఆచరణలో పెట్టి ఎంతో ఆర్తితో మోక్షంకై యత్నించాలి నాయనా.

అటుపై  మౌనమంటే ఏమిటో చెప్పమని దృతరాష్ట్రుడు అడగగా -

యతో నవేదా మనసా సహైనమ్
అనుప్రవిశన్తి తతోథ మౌనమ్
యత్రోత్ధితో వేదశబ్దస్తధా యం
స తన్మయత్వేన విభాతిరాజన్

మౌనం మనస్సుకు సంబంధించినది.  మౌనమంటే  తెలుసుకోవటం, చూడటం, అది తాను అవటం. వేదశబ్ధం ఎక్కడెక్కడయితే అమలుపరచటానికి వీలవుతుందో అక్కడక్కడల్లా వున్నది మౌనమే. ఆ స్థితే తన్మయత్వ స్థితి. తానే అది అయ్యే స్థితి.

                       *  లోకాస్సమస్తా సుఖినోభవంతు  *

22, జులై 2016, శుక్రవారం

సనత్సుజాతీయం (తృతీయ భాగం)

శ్రీ సనత్సుజాతులవారు దృతరాష్ట్రునికి పొరపాటే మృత్యువనియు, మృత్యువుకు ఆకృతి లేదనియు చెప్తూ, ఇంకా ఇలా వివరిస్తున్నారు - 

మృత్యువంటూ వేరేగా ఏమీ లేదయ్యా. నీవేం చేస్తున్నావో దాన్నిబట్టి ఉంటుందయ్యా...
మృత్యువు ఎక్కడనుండి వస్తుందంటే ...
రాజా!
"క్రోదః ప్రమాదో మోహ రూపస్య మృత్యు:"  క్రోధం వలన, పొరపాట్లు చేయడం వలన, మోహం వలన మృత్యువు వస్తుంది. ప్రమాదమంటే పొరపాటు. తాను చేయవలసింది చేయకుండా, తనకు చేద్దామనిపించింది చేసేస్తే అదే పొరపాటు. ఏది చేయాలో, ఏది చేయకూడదో మనోబుద్ధులకు తెలుస్తుంది. దానిని గ్రహించి నడుచుకోకపోతేకనుక అదే మృత్యువు. ఇటువంటివారు "ఇతః ప్రేతాః" ఇక్కడనుండి వెళ్ళిపోయినవారై (శరీరం వదిలిన వారై) "తత్ర పునః పతంతి" మరల ఇక్కడే పడుతుంటారు. అంటే జననమరణ చక్రంలో తిరుగుతుంటారు.

అటుపై సత్కర్మ దుష్కర్మల గురించి ఇలా వివరిస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు ...


ఓ దృతరాష్ట్రా! మృత్యువు ఉండడం, లేకపోవడం మన కర్మల బట్టే వుంటుంది. "కర్మోదయే కర్మఫలానురాగా" కర్మ ఉదయించినప్పుడెల్లా అంటే కర్మ చేయాలనే తలపు రాగానే, ఆ కర్మఫలం అనురాగం కలిగిన వారౌతున్నారు.  నీవు ఏ దృష్టితో కర్మ చేస్తావో, దాన్నిబట్టి ఫలితముంటుంది. పూజలు హోమాదులు లోకక్షేమం కొరకు చేస్తే పుణ్యకర్మలు అవుతాయి, స్వార్ధంతోగాని, ఇతరులకు అపకారం కలిగించడానికి గాని చేస్తే సత్కర్మలు కూడా దుష్కర్మలే అవుతాయి. ఇచ్చా అరిషడ్వర్గాలతో కలిగినట్టి కర్మలు చేస్తే ప్రారబ్ధాలు తప్పవు, జననమరణాలు తప్పవు, మృత్యువు తప్పదు. కర్తవ్యం నుండి విముఖులు కానటువంటివారై తాము ఏది ఆచరించాలో అది ఆచరిస్తూ, చేయదలచినదంతా చేయకుండా, చేయవలసినవి చేస్తే కర్మ నాశం అవుతుంది, నిష్కామ కర్మ నైష్కర్మ్యసిద్ధి వస్తుంది, మోక్షమొస్తుంది. ఆచరణ యందు బుద్ధి విడిచి వుండి, భగవత్ సమర్పణ బుద్ధితో కర్మాచరణ చేసేవారికి కర్మ అంటదు. 



మన కర్తవ్యాన్ని మనం ఫలాపేక్ష లేకుండా, భగవంతునార్పణ బుద్ధితో నిర్వహిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధములనేవి ఉండవు. 

ఇటువంటివారికి మృత్యువు లేనట్లే.

"నేను" అంటే శరీరం కాదయ్యా, నేను అనగా "ఆత్మ". శరీరం వున్నప్పుడు "నేను" అనే ఒకానొక ప్రజ్ఞగా ఉన్నాం. శరీరం వదిలిన తర్వాత కూడా "నేను" అనే ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది. దేహ భ్రాంతి ఉన్నవారికే మృత్యువుంటుంది.

ఏది సత్యమో, నిత్యమో, ఏది మిధ్యో గ్రహించి, ఇంద్రియార్ధముల యందు మోహపడకుండా, ఇంద్రియాలతో కూడి మనస్సును వెళ్లనీయకుండా, స్వస్వరూప స్థితిని ఎఱిగి, అందరూ ఆత్మ స్వరూపములే అన్న సత్యాన్ని గ్రహించి తదానుగుణంగా జీవించువారికి మృత్యువుండదు రాజా.

సృష్టిలో ఉన్నటువంటి జీవుడు, సృష్టికి అతీతమైన దేవుడు... వీరు ఇద్దరు ఉన్నట్లు అన్పిస్తుందిగాని, దేవుడి అస్తిత్వంను అంగీకరించి శమదమాది గుణాలు కలిగి, ధ్యానాది సాధనలు చేస్తే, జీవుడే(ఆత్మ) దేవుడనే(పరమాత్మ) అన్న జ్ఞానం కలిగిననాడు తానే అది అవుతాడు. అటువంటివారికి మృత్యువుండదు. అన్నింటికి మన సంకల్పాలే కారణం. అంటే మనస్సే కారణం. మనస్సు ఏది సంకల్పించిందో దాని బట్టి ఉంటుంది. మనస్సు మృత్యువును కల్పించుకుంటే మృత్యువౌతుంది, పరబ్రహ్మమును కల్పించుకుంటే మనస్సు కూడా ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. రాజా! కామ, క్రోధలోభాది అరిషడ్వర్గములున్నపుడు అవే మదిలో స్థిరపడతాయి కానీ, తానుండడు. ఆ తాను లేకపోవడమే మృత్యువు. మనస్సును ధర్మమార్గమున సత్కర్మాచరణం చేసి, ధ్యానాదులు ఉపాసన చేసి ఆత్మసాక్షాత్కారం పొందితే, శరీరం వున్నను ఆ జీవుడు మోక్షమందున్నట్లే. ముక్తి అనేది శరీరం పోయాక కాదు, ఉన్నప్పుడే పొందాల్సిన స్థితయ్యా. మృత్యువు కర్మ చేత, అజ్ఞానం చేత కల్పించుకున్నదే.

ఆత్మయందు ధ్యానం కలిగియుండి శాశ్వతమూ, నిత్యమూ అయినటువంటి వస్తువునందు మనస్సు నిలిపి, ఈ మిగిలినటువంటివన్నీ మనమెట్లా చేసుకుంటే అట్లా జరుగుతాయనేటువంటి సంగతి గుర్తుండి, మనమెలా సత్కర్మలు ఫలాపేక్షలేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించుకోవాలో అలా ఆచరించుకుంటూ ఉంటే మృత్యువు లేదయ్యా.
అని చెప్తూ, ధర్మాధర్మాల గురించి ఇలా వివరిస్తున్నారు ... ఈ వివరణ తదుపరి టపాలో ... 








21, జులై 2016, గురువారం

సనత్సుజాతీయం (ద్వితీయ భాగం)





దృతరాష్ట్రుడు పాండవుల పట్ల తన కర్తవ్యాన్ని ఆచరింపకపోతే అతని కుమారులకు మృత్యువు తప్పదని విదురుడు చేసిన హెచ్చరికతో అధర్మాన్ని అన్యాయాన్ని సరిచేయాలని అనుకోకుండా, మృత్యువు గురించి, అమృతత్వం గురించి ఎఱుకపరిచే బ్రహ్మవిద్యను తెలుసుకొని తన కుమారులు మృత్యువాత పడకుండా చేద్దామని తలచి దానిని తెలుపమని సనత్సుజాతులవారిని ఇలా ప్రశ్నిస్తాడు -

దృతరాష్ట్ర ఉవాచ -

సనత్సుజాత యదిదం శృణోమి
నమృత్యుర స్తీతి తవోపదేశమ్
దేవాసురా ఆచరన్ బ్రహ్మచర్య
మ మృత్యవే తత్కతరంను సత్యమ్

మృత్యువు లేదని మీరు చెప్పిన ఉపదేశాలు గురించి విదురుని ద్వారా విన్నాను. దేవతలు, అసురులు కూడా మృత్యువు జయించుటకోసం బ్రహ్మచర్యం ఆచరించారని విన్నాను. వారేమో మృత్యువు జయించడానికి ప్రయత్నం చేశారంటున్నారు. మీరోమో మృత్యువే లేదంటున్నారు. పరస్పర విరుద్ధంగా వున్న  ఈ మాటల్లో ఏది సత్యం? ఏది నమ్మాలి?
అని దృతరాష్ట్రుడు సనత్సుజాతులవారిని ప్రశ్నించగా -

శ్రీ సనత్సుజాత ఉవాచ -

ఉభేసత్యేక్షత్రియాద్య ప్రవృత్తే
మోహోమృత్యు: సంమతో య:కవీనాం
ప్రమాదంవై మృత్యుమహం బ్రవీమి
సదా ప్రమాదమమృతత్వం బ్రవీమి

ఓ క్షత్రీయుడా! మృత్యువు లేకపోవడం, మృత్యువును తరించడం ... ఈ రెండూ నిజమే. ఈ రెండూ సత్యేమేనని తెలుసుకో.
దేవతాసురులు మృత్యువును ప్రయత్నపూర్వకంగా జయించడమంటే ......
మృత్యువు అంటే మోహం. "నేను" అన్న అహం. హృదయగ్రంధి నందు అహం ఉంటే మృత్యువున్నట్లే దానిని జయించడానికి ప్రయత్నించాలి. హృదయాంతరమున ఆంతర్యామే ఉంటే మృత్యువు లేనట్లే. ప్రమాదం (పొరపాటు) మృత్యువు. అంటే పొరపాటు ఉన్నచోట మృత్యువుంటుంది. పొరపాట్లు చేయకుండా జీవించడమే అమృతత్వం. పొరపాట్లు లేని చోట మృత్యువుండదు. 
మానవుడు తన ఇంద్రియాలను పరమాత్మునిలో ఐక్యం చేసుకుంటే మృత్యువనేది ఉండదు. మట్టితో చేయబడిన కుండకు పగిలిపోవడముంటుందిగాని మట్టికి వినాశనం ఉండదు. అలాగే ఆత్మతో నిండియున్న శరీరాదులకు మార్పు ఉంటుంది గాని ఆత్మకు మార్పు ఉండదు. ఆంతర్యామితో జీవించేవారికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు స్థానంలో ఆత్మే నిలుస్తుంది. ఇలా ఆత్మనిష్ఠులైన వారికి మృత్యువుండదు.

సృష్టాది నుండి శాశ్వతమూ, నిత్యమూ, సత్యమూ అయినటువంటిది, వేదశబ్ద వాచ్యమయినటువంటి ధర్మమున్నది. అది సనాతనమైనది. ఈ సనాతన ధర్మమును తెలుచుకొని తదనుగుణంగా జీవిస్తే మృత్యువు లేనట్లే. ఆ ధర్మమును తప్పితే పొరపాటు చేసినట్లే, మృత్యువు ఉన్నట్లే.

అని చెప్తూ ఇంకా ఇలా వివరిస్తున్నారు సనత్సుజాతులవారు - 

ప్రమాదాద్వా అసురాః పరాభవన్ 
అప్రమాదాద్ బ్రహ్మభూతాః సురాశ్చ 
సవైమృత్యుర్వ్యాఘ్ర ఇవాత్తి జస్తూన్ 
సహ్యస్వరూప ముపలభ్య తేహి

ప్రమాదం అంటే పొరపాట్లు వలన అసురులు పరాభవం పొందారు. పొరపాటు పడకుండా ఉండడం వలన సురులు బ్రహ్మభూతులైనారు. 
(అమృతత్వం కోసం దేవాసురులు ప్రయత్నించారు కానీ, మోహినిపై మోహంతో అసురులు అంతవరకు తాము దేనికై ప్రయత్నం చేస్తున్నారోనన్న విషయం మరిచి పరాభవం పొందారు.పొరపాటు పడకుండా, తాము దేనికై  ప్రయత్నం చేస్తున్నారో గుర్తుంచుకోవడం వలన సురులు బ్రహ్మభూతులైనారు). ఏది యుక్తమో, ఏది అయుక్తమో గ్రహించి, ఏమరుపాటు లేకుండా బ్రహ్మచర్యం (పరబ్రహ్మ యందు చరించుట) పాటించువారికి మృత్యువుండదు. 

దేహాత్మ బుద్ది గలవారు అసురులు. ఇంద్రియ సుఖాలు కోసం జీవించేవారు అసురులు. అసురులు అంటే దుర్బుద్ధులు. దుర్బుద్ధి ఎక్కడుంది? మన బుద్ధిలోనే ఉంటుంది.  ఆత్మనిగ్రహం ఇంద్రియనిగ్రహం కలవారు సురులు. సురులంటే సద్బుద్ధి. ఇదీ మన బుద్ధిలోనే ఉంటుంది.

మృత్యువనేది మృగంలా రాదు. పులిలా వచ్చి కబళించదు. మన దినచర్యలో మనం ఆచరించుకొంటున్నటి పనులేవైతే ఉన్నాయో, వాటివలన మృత్యువు ఉండటమో, లేకపోవడమో ఉంటుంది. అజ్ఞానంతో దేహమే నేననుకుంటే ఆ దేహం విడుస్తున్నప్పుడు మృత్యువు వచ్చిందంటారు. దేహాత్మభావన లేనప్పుడు దేహం విడుస్తున్నాననుకుంటారు. వీరికి మృత్యువు లేదు. అంతేకాని దీనికి రూపముండదు.

అని ఇంకా మరింత వివరణ ఇస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు -

ఆ వివరణ తదుపరి టపాలో ...









20, జులై 2016, బుధవారం

"సనత్సుజాతీయం"

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు,. ఆ పరమాత్ముడే సత్యం ... సనాతనం. అతని ప్రేమైక సృజనయే సృష్టి.

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై భాసిల్లే పరతత్త్వం గురించి తెలియజెప్పేదే వేదం. దీనికి శబ్ధరూపములుగానైన ప్రతులే ఋగ్వేదాది నాలుగు వేదములు. వీటి సారమే విజ్ఞానదాయకమైన ముక్తిప్రదాయినులగు పురాణములు, రామాయణము, మహాభారతం, భాగవతములు. ఇందు రామాయణం వాల్మీకి ప్రోక్తం కాగా, మిగిలినవి వ్యాసప్రోక్తములు.  ఇందులో మహాభారతం పంచమవేదంగా ప్రశస్తి పొందడానికి కారణం - అందు అశ్వనీదేవతల స్తుతి, సనత్సుజాతీయం, భగవద్గీత, ఉత్తరగీత, భీష్ములవారి ఉపదేశములు, విష్ణు సహస్రనామములు మొదలగు ఎన్నో ముక్తిత్వంలను ఒసగు ధర్మ ధార్మిక ఘట్టములు అనేకములు వుండడంచే పంచమవేదంగా కీర్తింపబడుతుంది.

శ్రీమన్నారాయణునిచే వేదములు గ్రహించిన సృష్టికర్తయగు బ్రహ్మ తేజోమయ చతుర్ముఖములకు నేపధ్యములు సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు. ఈ ముఖములందలి తేజస్సులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు పరమ ఋషీంద్రులు. బ్రహ్మవిద్యా ప్రవర్తుకులు.

శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడుగా అవతరించక ముందే దైవప్రణాళికకు సహకరించడానికి సనత్కుమార, సనత్సుజాతులవారు గోపాలురుగా దిగివచ్చిరి. ఇందులో సనత్సుజాతులవారు శతగోపనామధేయంతో గోకులంకు వచ్చిరి. ఈయనే రాధదేవిని పెంచిన తండ్రి. ఇటు నరదేహంన శతగోపుడుగా వర్తించుచున్నను, అటు సనత్సుజాత ఋషీంద్రులుగా కూడా వర్తించగలిగేవారు. కృష్ణ భక్తుడును, సద్గుణవంతుడయిన విదురుడు వీరి శిష్యుడై బ్రహ్మజ్ఞానం పొందిరి.

సంజయుడు పాండవ వాసుదేవుల వద్దనుండి తిరిగివచ్చిన తర్వాత...
దృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేయమని, లేదంటే యుద్ధం తప్పదని, యుద్ధమే సంభవిస్తే నీ కుమారులెల్లరు మృత్యువాత పడేదరని విదురుడు ఉపదేశించినను, దురాశతో విదురుని మాటలకు దృతరాష్ట్రుడు విలువివ్వలేదు. కానీ, తన కుమారులు యుద్ధమందు మరణిస్తారేమో నన్న భయంతో నిద్రపట్టక విదురునిని రప్పించుకొనగా ...
రాజా!   ఏ విధమైన అనారోగ్యాలు లేనప్పుడు నిద్ర పట్టనిది నలుగురికే. 1. బలవంతుడయిన శత్రువు తనపై దాడి చేస్తాడేమో నన్న భయంతో వుండే బలహీనునకు, 2. సరుకు (సంపద)కోల్పోయినవారికి 3. దొంగకు 4. కామాతుర చిత్తుడునకు. రాజా! ఇప్పుడు చెప్పు ... ఎందుకు నీకు నిద్రపట్టడం లేదు అని విదురుడు అడగగా -
ప్రతీవారు మృత్యువే అంటారు, ఆ మృత్యువును దాటడానికి ఏ మార్గమూ లేదా ? అన్న దృతరాష్ట్రుని ప్రశ్నకు విదురుడు ఇలా ప్రబోధిస్తాడు -
ఆధ్యాత్మిక జ్ఞానం ... ఆత్మవిద్య ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకొని, దాని మీద మనస్సు నిలిపి, మనస్సులో కూడా అదే అంతర్యామిత్వం చెంది, ఇంద్రియములను నిలిపి, ఇంద్రియములలో కూడా అదే అంతర్యామిత్వం చెంది, దేహము, మనస్సు ఇంద్రియములు అనేటువంటివి లేకుండా, వాటి స్థానంలో కూడా సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమునే నిలుపునటువంటి ... ధారణ, ధ్యాన సమాధి నిష్టులయిన మహాత్ములకు మృత్యువు లేదు అని చెప్పగా ...

"మృత్యువు" యొక్క స్వరూపంను, మృత్యువును దాటే ఉపాయాన్ని తెలపమని విదురునిని దృతరాష్ట్రుడు కోరగా,  ఇది బ్రహ్మవిద్యా రహస్యం. దీనినుపదేశింప తానర్హుడ గానని, మా గురువుగారే అర్హులని, దానిని ద్రుతరాష్ట్రునికి ఉపదేశించుటకు  తన గురువగు సనత్సుజాతులవారిని విదురుడు సంస్మరించెను. స్మరణ మాత్రంచేత అనుగ్రహిస్తానని విదురునికి మాట ఇచ్చిన సనత్సుజాతుల వారు ప్రత్యక్షమై ద్రుతరాష్టునికి ఉపదేశించిన దివ్యజ్ఞానామృతమే "సనత్సుజాతీయం". 


తదుపరి వివరణ తదుపరి టపాలో ... 


27, మే 2016, శుక్రవారం

తెలుసుకోవాలని ఉంది...

శంబూకుడి వధ గురించి వ్రాయండి, ఈ మధ్య ఏదేదో వింటున్నాను, మీరు చెపితే తెలుసుకోవాలని ఉంది...

అని ఓ మిత్రురాలు అడిగారు.

నిజమే, ఈ కధపై విమర్శలు వున్నాయి. శూద్రులు తపస్సు చేయకూడదా? చేస్తే నేరమా? అందుకు సంహరిస్తారా? శూద్రులంటే ఎందుకింత వివక్ష? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ధర్మమూర్తి అని అంటారే శ్రీరామచంద్రున్ని, మరి ఆయనే, ఎవరికీ ఏ హానీచేయక తపస్సు  చేసుకుంటున్నశంబూకుడు అన్న శూద్రున్ని సంహరించడం ధర్మమా? ... ఇత్యాది ప్రశ్నలతో కొన్ని విమర్శలు వింటున్నాను అప్పుడప్పుడు!
మిత్రమా!
ఈ శంబూకుని కధ లోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చతుర్వర్ణాలు గురించి, శాస్త్రం గురించి, అప్పటి యుగధర్మం గురించి,  అప్పటి ప్రజలు ఎలా వుండేవారు?... ఇత్యాది విషయాలు ఓసారి పరిశీలిస్తే -

రామాయణం బాల కాండము, అయోధ్యా కాండము, అరణ్య కాండము, కిష్కింధ కాండము, సుందర కాండము, యుధ్ధ కాండము, ఉత్తర కాండము అనే ఏడుకాండలుతో కూడుకున్నది. ఇందులో ఉత్తరకాండ వాల్మీకి వ్రాసింది కాదని, ఇది ఋషిప్రోక్తమని / ప్రక్షిప్తమని కొందరు చెప్తుంటారు. అలానే రామాయణంలో కొన్ని కధలు (లక్ష్మణ రేఖ, శబరీ రామునికి పండ్లు తినిపించడం, హనుమాన్ తన గుండెను చీల్చడం మొ..) కూడా ఋషిప్రోక్తమేనని అంటుంటారు.
అసలు ఈ ఋషిప్రోక్తమంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.

ఈ సృష్టి మొత్తము పరస్పరత్వముపై ఆధారపడి యున్నది. ఒక అంశంతో పరస్పర సహకారం లేక మరియొక అంశమునకు అస్తిత్వం లేదు. సర్వజీవరాశుల యెడలను  ఈ సత్యమును మనం గమనిస్తే అవగతమౌతుంది. ఈ పరస్పరత్వము గురించి, ధర్మాల గురించి తెలియజేయునది శాస్త్రం. దీనియందు ప్రజ్ఞయున్నవారిని లేదా దీనిని దర్శించేవారిని ద్రష్టలు లేక ఋషులు అందురు. ఋషులు అంటే జ్ఞానపారంగతులు. జీవిత సూక్ష్మాన్ని, తత్త్వాల్ని దర్శించగలిగే యోగద్రష్టలు. వేలసంవత్సరాలు తరబడి ఋషుల పరంపర ఈ పరస్పరత్వమను మహత్తర సత్యమును దర్శనం చేసి, క్రోడీకరించి ఇచ్చిన శాస్త్రం పరంపరాగతంగా మనకు అందింపబడుచున్నది.
ఋషులు అంటే ఆశ్రమంలోనో, అరణ్యంలోనో, తపోదీక్షతలో ఉంటూ నిస్సంతుడై సమాజానికి దూరంగా వుండేవారని అనుకుంటే పొరపాటే.  యుగయుగాలుగా, తరతరాలుగా కాల ప్రవాహగతిలో ఎప్పటికప్పుడు మార్పులను సంతరించుకుంటూ సాగిపోతున్న సమాజానికి ఎప్పటికీ కాలదోషంపట్టని సంస్కృతీవిధిని, సమ్యగ్వివేచన, ఆచరణ అనేవి సమాజహితం కోసం శాస్త్రాల్లో పొందుపరుస్తూ భావితరాలకు మార్గదర్శకం చేసేవారే ఋషులు. 
ఋషులు అనుభవజ్ఞానంతో యోగదృష్టితో దర్శించిన ధర్మమే మనకు ప్రమాణికం.
ధర్మమును ఆచరించాలంటే - ఏది ధర్మమో, ఏది కాదో గ్రహించే జ్ఞానముండాలి. అలాంటి జ్ఞానం మానవునికి కొంత సహజంగా వున్నను, అది మాత్రమే సరిపోదు. యుగ యుగానికి, దేశ దేశానికి ధర్మం మారిపోతుంది. ఒకరికి ధర్మంగా అన్పించింది, మరొకరికి అధర్మంగా గోచరించవచ్చు కాబట్టి అల్పజ్ఞుడైన మానవుడు తన బుద్ధితో నిర్ణయించవలసినవి కావీ ధర్మాధర్మాలు. ఋషిప్రోక్తమైన శాస్త్రాలే మనకు మార్గదర్శకం. మన హైందవ సంస్కృతికి మూలం శాస్త్రాలే. 
వ్యక్తిశీలాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని తీర్చి దిద్దడానికి ఋషులప్రోక్తమైన సందేశాత్మక కధలు ఉపదేశాలు, మానవాళికి ఎంతో తోడ్పడతాయి.
దీనిబట్టి మనకు అవగతమౌతుంది ఋషిప్రోక్తం అంటే ఋషులచే చెప్పబడినవి మనకు శ్రేయోదాయకమని. 

ఇక చతుర్వర్ణాలు గురించి -

అందరూ చైతన్యస్వరూపులే.  ఇందులో సందేహం లేదు. అయితే, 
వారిలో విద్య చెప్పుటకొరకును, దేవపూజ చేయుటకొరకును కొందరు, శత్రువులను నిరోధించుటకొరకును, 
అందరిని ఓ పద్ధతిలో నడిపించుటకును, బలం, ధైర్యము గల కొందరిని, దేహబలమున బుద్ధి యుక్తిశ్శక్తియున్నవారిని వ్యాపరకృత్యములకు, 
తెలివి సంపూర్ణంగా లేనివారిని కృషిచేయుటకును, ఇతరపనులు చేయుటకును నిశ్ఛయించి, జనుల పరిపక్వత అనుసరించియు, అప్పుడుండు స్థితిని అనుసరించియు పూర్విజులు మానవులను నాలుగుభాగములుగా నియమించి వుండవచ్చునని పెద్దలు చెప్తుంటారు. 
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః । 
తస్య కర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్ ॥ 

మానవులు తమ సదుపాయమునకై బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర ధర్మములనుసరించి నాలుగు వర్ణములుగా ఏర్పడిరి. మానవులు చేయుపనులు నాలుగు విధములుగా నుండును. 1. తెలుసుకొనుట, తెలియజెప్పుట, 2. కాపాడుకొనుట, కాపాడుట, 3. ఉపయోగపడుట, ఉపయోగించుకొనుట, 4. కాయకష్టంతో పనులను చేసుకొనుట, చేసిపెట్టుట. ప్రతీ మానవుడు ఈ నాలుగింటిలో ఏదో ఒకదానికి పనికి వచ్చు స్వభావంను కలిగియుందురు. దీనినిబట్టే వృత్తి కర్మలు ఏర్పడును. ఈ నాలుగు విధముల విభాగమునే పెద్దలు నాలుగు వర్ణములుగా పేర్కొనిరి. 

అందరూ వేదపండితులమై వుంటామంటే సమాజం నడవదు. అందరూ క్షత్రీయులమై వుంటామన్నా, వ్యైశ్యులమై వుంటామన్న ఈ సమాజము నడవదు. ధర్మమేమిటో తెలియజెప్పే వేదశాస్త్రాలు అభ్యసించి ఆచరించి, తెలియజేప్పేవారు కావాలి, తప్పుచేసేవారిని శిక్షించడానికీ, ప్రజలను పరిరక్షించడానికీ, సరైన మార్గంలో నడిపించడానికీ పాలకులూ కావాలి, అలానే మిగతా వర్ణాలువారు అవశ్యం సమాజానికి.
అందుకే పూర్విజులంటారు - కేవలం సత్వగుణం వల్లనే సంఘం నడవదు. రాజసిక, తామసిక లక్షణాలూ వుండాలి. తప్పుచేసేవారిని శిక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి రజోగుణం, పొలం దున్నాలి, పండించాలి, కడుపునిండా తినాలి, కంటి నిండా నిద్ర కావాలి! ఇది తమోగుణం. ఈ పనులన్నీ లోక క్షేమం కోసం చేయాలి కనుక అట్టి రాజసిక తామసిక కృత్యాలను భగవానుడు నిందించలేదు. వారిట్టి పనులు చేసి సంఘాన్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్నారు కనుక ఆ పుణ్యం వలన ఉన్నతస్థితినే పొందుతారు. 
గృహస్థు ఆశ్రమవారిపై మిగిలిన మూడు ఆశ్రమముల వారు కొంత ఆధారపడి వున్నట్లే , శూద్ర వర్ణంవారిపై తక్కిన వర్ణపువారు కొంత ఆధారపడే వున్నారు. అటువంటప్పుడు శూద్రజాతి అనే చిన్నభావన ఎందుకు? అన్ని వర్ణాలువారు సమాజానికీ అవసరమని, సమానమేనని అవగాహనతో, సామరస్యముగా సౌహార్దంగా వుంటే మేలు కదా. 
అప్పటియుగధర్మం, ప్రజల జీవనం - 
త్రేతాయుగంలో ప్రజలందరికీ విధ్యుక్త కర్మలంటూ నియమించబడి వున్నాయి. వాటిని వారు శ్రద్ధగా పాటించేవాళ్ళు. మన ఉపనిషత్తులు 'సత్యం వద ధర్మం చర', 'స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహ' అని ఘోషిస్తున్నాయి గదా. దానినే ప్రజలు మనఃపూర్వకంగా నమ్మి జీవించేవారు. అప్పటి యుగధర్మమది.
ప్రజలందరూ స్వధర్మాచరణలో ధర్మనిరతులై  కల్లా కపటాలు, కార్పణ్యాలు లేనందున పరస్పర సహకారంతో విరోధాలు లేక ఆత్మీయతతో మెలుగుతూ సుఖజీవనం సాగిస్తూ వుండేవారు. అందరును సహోదరభావంతో జీవించేవారు. అన్నివర్ణాలువారు శాస్త్రప్రామాణికంగానే జీవించేవారు. శాస్త్రం పట్ల అప్పటివారికి అవగాహన, ఆదరణ,ఆచరణ వుండేది. 

అసలు శాస్త్రం అంటే ఏమిటి?
ఇది చేయుము, ఇది చేయకుమని శాసించున దగుటచేతనే దీనికి శాస్త్రమని పేరు వచ్చింది. రాజశాసనమందు ఇట్టి పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఉన్నతోద్యోగంను, ప్రజలకు ఇట్టి బాధలు కలుగజేయువారికి కారాగార దండనయు ఎట్లు విధింపబడి యున్నవో, అలాగున ఇట్టి కార్యంచే పుణ్యమూ, ఇట్టి కార్యంచే పాపమూ, ఇట్టి విరక్తి మార్గంచే మోక్షమునూ, ఇట్టి విషయ ప్రవృత్తిచే సంసార బంధమును శాస్త్రం విధించుచున్నది. అందుచే శాస్త్రవిధి ననుసరించి ప్రవర్తించు వారికట్టి ఉత్తమలోకప్రాప్తి కలుగును. 
మానవులందరూ ఒక్కటేయైనను వారి స్వభావంను బట్టి, వృత్తిని బట్టి, వంశాచారమును బట్టి భిన్నంగా నుందురు. వారి వారి ప్రవృత్తికి, వృత్తికి, కులమునకు, వంశమునకు అనుగుణంగా వారు ఆచరింపవలసిన విదానములుండును. ఆదర్శవంతమైన ధర్మాలు అందరికీ అంటే ఎవ్వరూ పాటించరని మన ఋషులు గుర్తించి, భిన్న వ్యక్తులకు భిన్న వర్ణాలు, బిన్నధర్మాలు సూచించారు.
ఒక వర్ణం గొప్పదని, మరొకటి నీచమని శాస్త్రాలలో లేదు. శాస్త్ర నియమాలు కొంత సరసర్దుబాటుతో ఉంటాయి. అందరూ అన్ని ధర్మాలను పాటించాలని చెప్పదు. వారి వారి వృత్తుల కనుగుణమైన ధర్మాలను పాటించాలని అంటుంది. జాతిని బట్టి భేదభావంను చూపించదు. వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వివిధ ధర్మాలుంటాయి. ఒక వృత్తి గొప్పదని, ఒకటి నీచమని చెప్పదు. కర్మను బట్టి ఆచారాలు మారుతాయి. రకరకాల వృత్తులు రకరకాల వర్ణాలకు వృత్తి ధర్మాన్ని పాటించడం శ్రేష్టమని శాస్త్రాలు తెలిపాయి. ఆ స్వధర్మ ఆచరణయే ఉన్నతి స్థితిని ప్రాప్తింపజేస్తుందనే తెలుపుతుంది. ఎవరి కర్మలో వారు సిద్ధి పొందాలని గీత సందేశం. అనగా స్వధర్మానుష్టానం వుంటే పరిపక్వత పుణ్యం దానంతట అదే సిద్ధిస్తుంది. తన పని యేది, తన పని కానిదేది తెలియుటలోనే ఇహపరముల పరిష్కారమంతయూ యిమిడియున్నది. తనపని ఏదియో తెలిసికొను నిపుణత, ఆచరించు శ్రద్ధ, ఈ రెండునూ కలవారు ఆచరించునదే లోకమునకు సత్కర్మ యగును. తనకు స్వధర్మమగును. కార్యసిద్ధినికాని, ఆధ్యాత్మికసిద్ధినిగాని కోరినవారు శాస్త్రంను అంగీకరించి ఆచరించి తీరవలెను.
యశ్శాస్త్రవిధిముత్స్రాజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥
ఎవరు శాస్త్రోక్తవిధిని విడిచిపెట్టి స్వేచ్చగా ప్రవర్తించుచున్నారో, వారు సిద్ధిని పొందరు. సుఖమును పొందరు. సర్వోత్క్రుష్టమగు ముక్తిని కూడా పొందరు.

నీవు దీనిని చేయుమని చెప్పునట్టి శాస్త్రవిధివాక్యమును, నీవు దీనిని చేయకుము అని చెప్పునట్టి ప్రతిషేధవాక్యమును అనగా వేదోక్తములగు విధిప్రతిషేధవాక్యములను అనాదరణ చేసి, విడిచిపెట్టి, స్వేచ్చాప్రకార మెవరు నడుచుకోనుచున్నారో, వారికి పురుషార్ధ ప్రాప్తియోగ్యమగు తత్త్వజ్ఞానం గాని, ఇహలోక సౌఖ్యం గాని, స్వర్గం గాని, మోక్షం గాని ఏదియును లభింపదు.

ఇక శంబూకుని కధ -
ఉత్తర కాండలోని ఈ కధ అందరికీ తెలుసుకాబట్టి, సంక్షిప్తంగానే ఈ శంబూకుని వధను తెలుపుతాను -

ఒకరోజు ఓ బ్రాహ్మణుడు అకాల మరణం పొందిన తన కుమారుణ్ణి రామ దర్భారుకు తీసుకువచ్చి దుఃఖాతిశయంతో రామున్నినిందిస్తూ ఆశ్రయించగా, ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటని వశిష్ఠులు తదితరవారిని శ్రీరాముడు వివరణ కోరగా, వారు స్వధర్మం విడిచి, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే తపనతో శంబూకుడు చేస్తున్న తపస్సే కారణమని చెప్పగా, వారి సూచనమేరకు శంబూకున్ని తన ఖడ్గంతో సంహరించగా ఆ బాలుడు పునర్జీవుడు అయినట్లు ఉత్తరాకాండలో కధ .

ఈకధ త్రేతాయుగం నాటిది. శ్రీరాముని కాలం నాటిది.
ఆ కాలంలోఆయా జాతులవారు వారివారి స్వధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ, తమతమ వ్యక్తిత్వాల్ని సరిదిద్దుకుంటూ జీవనం సాగిస్తే చాలు, సకాలంలో అదే జ్ఞానంగా పరిపక్వం పొంది మోక్షాన్ని ప్రసాదించే త్రేతాయుగమది. 
అప్పటి యుగధర్మం ప్రకారం స్వధర్మాచరణ పట్ల మొగ్గుచూపక, ఆచరించక పరతంత్ర మోహితుడై తన ఇచ్ఛానుసారం వర్తించడం, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే అసహజ కోరికతో తపస్సు చేయడం తప్పు. తప్పుచేసినవారిని శిక్షించడం రాజధర్మం. శంబూకున్ని శ్రీరాముడు అందుకే శిక్షించాడు. 
ఆచారః పరమో ధర్మః (సదాచరణమే పరమధర్మము). 
ఆచారహీనం న పునంతి వేదాః (ఆచారహీనున్ని వేదాలు కూడా పవిత్రం చేయవు). 

శూద్రుడనే వధించాడు అని అనేకంటే, శంబూకుడు ఆనాటి యుగధర్మమును విడిచి, విపరీత కోరికతో తపస్సు చేయడం సరికాదని అవగాహన చేసుకుంటే మంచిది.
ఆ కాలంలో శూద్రుడికే కాదు, అందరికీ ఒకే ధర్మం. రాజైనా ధర్మానికే కట్టుబడి నడుచుకునే యుగమది. 
ఓ రజకుడు  పరమసాధ్వి సీతమ్మపై నింద వేశాడని వేగుల ద్వారా విన్న అయోధ్యాధిపతి శ్రీరాముడు ఒక వ్యక్తిగా కాకుండా సమాజ రక్షకుడైన రాజుగా ఆలోచించి, తనకెంత బాధాకరమైనను, సీతను పరిత్యజించాడు. ఆ యుగధర్మప్రకారం కుటుంబంకోసం ఒక వ్యక్తినీ, ఊరుకోసం ఓ కుటుంబాన్నీ, దేశంకోసం ఒక ఊరును త్యజించడం ధర్మం. అప్పటిధర్మానుసారం నడుచుకొని రాముడు చేసిన ఈ పనిని గుర్తించరేం?
ఒకరడిగారు -  రాములవారికి మల్లే నాకూ ఒకే భార్య. మరి రామున్ని ఏకపత్నీవ్రతుడని కీర్తించడం దేనికని? 
ఆప్పటికాలంలో రాజులు బహుభార్యత్వం కలిగి వుండేవారు. అయినప్పటికీ, సర్వకాల సర్వకర్మల సర్వధర్మాలయందు మనోవాక్కుకర్మేణా ఒకే భార్య అన్న భావంతో శ్రీరాములవారు వుండబట్టే ఏకపత్నీవ్రతుడని ప్రజలు కీర్తించారు. ఇలాంటి సూక్ష్మాలను గ్రహించక విమర్శలు గుప్పిస్తూ విభేదించడం సరికాదు.

శంబూకునికై యోచించేవారు వాదించేవారు స్వవిషయంలోనూ రాముడు ఎంత ధర్మ నిబద్ధతగా వ్యవహరించాడో గ్రహిస్తే బాగుంటుంది. కొంచెం పరిశీలన, విజ్ఞత అవగాహన వుంటే ఈ విషయం చక్కగా అర్ధమౌతుంది.

అన్నికులాల్లో గర్భితమైన మూలసత్యాన్ని గ్రహించి, అప్పటి యుగధర్మాన్ని అవగాహన చేసుకొని ఈ కధని చదివితే విమర్శకు తావే వుండదు. అలా కాకుండా తర్కబుద్ధితో ఒక వాదనను నిర్మించుకుని కులవ్యవస్థను విమర్శించడం వలన సామరస్యం కుదరక, శాంతి సౌహార్దాలు ఉండక అశాంతినే పొందుతాం 
                                                    

రామాయణం -

ఓ అద్భుత కావ్యం. అందరి మదిలో మెదిలే పవిత్ర కావ్యం.
వాగ్వాదాలు చేసేవారికి అంతుబట్టదు ఈ గ్రంధం. మనం సత్యాన్ని గ్రహిస్తే సత్యమే గోచరిస్తుంది. ధర్మాన్ని గ్రహిస్తే ధర్మమే దర్శనమౌతుంది.
శ్రీరాముడు ధర్మం విలువేమిటో. ధర్మానికి వున్న శక్తి ఏమిటో తెలియజెప్పిన మహిమాన్వితుడు.
రావణ సంహారసమయంలో మండోదరి తనభర్త మరణానికి ఆయన అనుసరించిన అధర్మమే కారణమని అంటుందేగాని రాముడు సంహరించాడని నిందించదు. ఓ రాక్షస స్త్రీకి అర్ధమైన రాముని ధర్మం, కలియుగ మానవునికి అవగతం కాకపోవడం 'కలి'. 

మిత్రమా!
ఏదైనా మనదృష్టికోణం బట్టే వుంటుంది. దృష్టికోణం మనోభావన బట్టి వుంటుంది. మనోభావన అవగాహన బట్టి వుంటుంది.

శుభమ్ ... 

14, ఏప్రిల్ 2016, గురువారం

రాములోరు ...



శ్రీరామనవమి అనగానే గుర్తుకువచ్చే ఒకప్పటి నా మధుర జ్ఞాపకం - 

శ్రీరామనవమి నాడు ... 
రామాలయం దగ్గర సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేవారు. మధ్యాన్నం కల్యాణం చేసి, సాయంత్రం లక్ష్మణ, అంజనేయుల సమేతంగా సీతరాముల్ని పల్లకిపై ఊరేగించేవారు. 
ఎప్పటికంటే కాస్తా ముందుగానే పలహారాలో, భోజనమో... అమ్మమ్మ పెట్టేసి ... చక్కగా తినేయండమ్మా, రాములోరు మన ఇళ్ళకు వస్తారు, మరి చూడాలి కదా, త్వరగా తినేయాలి మరి ... అనేవారు. త్వరగా తినేసి వీధిలోనికి పరుగులు... రాములోరికే ఎదురుచూపులు ... 
రాములోరు వస్తారు కాసేపటిలో అన్న సూచనగా వీధి తొలి మలుపులో ... ముందుగా డప్పులు ... ఆ వెనుక తప్పెట గుళ్ళు... ఆ వెన్నంటే ఎడ్లబండిపై రామయ్య, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు వేషం వేసుకొన్న వారు, ఆ వెంబడే సన్నాయి మేళతాళాలతో రాములోరి పల్లకి ... ఎదురెళ్ళి స్వాగతించడం ... మా గుమ్మంలోనికి సీతారాములవారు రాగానే, సాయంత్రం నుండి అందంగా అల్లిన పూలమాలలును మేమూ, కానుకలు ప్రసాదాలు పెద్దవారు సమర్పించడం ... వీధి చివరింటివరకు పల్లకి వెంబడి వెళ్ళడం ... చిన్నా పెద్దా మదినిండా భక్తితో, ధన్యులయ్యామన్న తృప్తితో అర్ధరాత్రి వరకు రాముని గురించి పెద్దవారు చెప్తుంటే వినడం ... ఓహో ... అదో మధురానుభూతి. 
                                              

                                       
ఒక కొడుకు తల్లితండ్రులను ఎలా గౌరవించాలో, 

ఒక శిష్యుడు గురువుగారితో ఎలా మసలుకోవాలో, 
ఒక అన్నయ్య తన తమ్ముళ్ళతో ఎలా నడుచుకోవాలో, 
ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో, 
ఒక మిత్రుడు మిత్రులను ఎలా ఆదరించాలో, 
ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ... 
అలా ఆచరించి ధర్మాన్ని చాటిచెప్పిన ధర్మమూర్తి నా "రాములోరు". 

మహర్షయిన వాల్మికి అయిన, 
పడవ నడిపిన కిరాతజాతికి చెందిన గుహుడైన, 
శబరకులానికి చెందిన శబరైనా, 
పక్షయిన జటాయువైన, 
వానరడైన సుగ్రీవుడైన, 
రాక్షసుడైన విభీషణుడు అయినా, 
చిరుజంతువయిన ఉడుత అయినా ... 
అందర్నీ ఒకేలా ఆదరించి గౌరవించిన మర్యాదరాముడు నా "రాములోరు".  

ధర్మం, సత్యం, కారుణ్యం, క్షమ, వినయం, విదేయత, ప్రేమ, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞ  ... ఇత్యాది సౌశీల్యాలు మూర్తిభవించిన సుగుణాభిరాముడు నా "రాములోరు". 

ఆదర్శపురుషుడుగా అగుపించి అందరి ఆరాధ్య దైవమయి, అంతరాల్లో అంతర్యామై ఆత్మారాముడుగా భాసిల్లుతున్నాడు నా "రాములోరు". 
ధర్మావలంబంవలన మానవుడు మాధవుడు ఎలా కాగలడో విషదపర్చేదే రామాయణం. 
మానవుడు మాధవుడు ఎలా కాగలాడో ... నిరూపించిన మార్గదర్శకుడు నా "రాములోరు".  
ఈ విషయమై వివరణ ఇచ్చేముందు ఒకప్పుడు నాలో కదిలాడే కొన్ని సందేహాలను ఇక్కడ  ప్రస్తావించడం సముచితం. 

కామి గానివాడు మోక్షకామి కాడు ... ఇది లోగడ విన్న మాటైనను, కొందరు దీనిని వక్రీకరించి అన్న మాటలు విన్నప్పుడు మన పెద్దలు ఇలా చెప్పారేమిటి అని బాధపడ్డాను.
స శాంతి మాప్నోతి న కామ కామి ... అన్నది గీతాచార్యుని వాక్కు. (సర్వేంద్రియ సంయమియైన సాధనపరుడైన సత్పుర్షునికే మోక్షస్థితి సాధ్యమవును గాని, కామం గలవానికి సాధ్యం కానే కాదు).
త్యజించవల్సిన కామాన్ని మోక్షంతో ఇలా కలిపి చెప్పడం ఏమిటని ఒకింత అయోమయంగా అనుకున్నా.
అలానే సాధకుడు వర్జించాల్సిన అరిషడ్వర్గములో ఒకటైన కామంతో మోక్షానికి ముడిపెట్టడమేమిటీ అని అనుకున్నాను. కాకపొతే పెద్దల మాటల్లో మర్మం అర్ధంకాకున్నా, అందులో పరమార్ధం ఏదో దాగి వుంటుందనే నమ్ముతానుకాబట్టి,  సరే, అర్ధమైనప్పుడే తెలుస్తుందనుకొని వదిలేశాను.

కాలగమనంలో మన వివాహ విశిష్టతలు, పద్ధతులు  తెలుసుకుంటున్నప్పుడు  తెలిసాయి కొన్ని విషయాలు -
ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వమైషా నాతిచరితవ్యాః అని కన్యాదానం చేస్తూ   (ఈరోజు వరకు నా కూతురిగా వున్న ఈమె నేటినుండి నీ అర్ధాంగి అగుచున్నది. ఈరోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటం లోను, ధన సంబంధిత విషయాలలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతుర్ని అతిక్రమించక మీరిరువురు అన్యోన్యంగా వుండాలని) కన్యాదాత అనగా,
ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి (ధర్మమునందు గాని, సంపదల విషయంలందు గాని, శారీరక సుఖవిషయంలందు గాని నిను అతిక్రమించి చరించను) అని వరుడు ప్రమాణం చేసే ఓ అద్భుత ఘట్టముందని. అలాగే ధర్మార్థ కామమోక్షాలను నాలుగింటిని  చతుర్విధ పురుషార్ధములని పేర్కొంటారని అర్ధమైంది. ఈ నాలుగింటిని చక్కగా ఆచరిస్తే జీవన సాపల్యమౌతుందని అర్ధం చేసుకున్నాను.
జీవిత పరమార్ధమంతా ఇందులోనే యిమిడివుంది కాబట్టి, ఈ నాలుగింటిని ఓసారి పరిశీలిస్తే ...
ధర్మార్ధ కామమోక్షాలు - ఇవి పురుషార్ధాలు.

మనిషి ధర్మంగా జీవించాలి. ఆ ధర్మంతో అర్ధం సంపాదించాలి. ఆ ధర్మం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి. ఇక కోరికలలో పడి కొట్టుకుపోకుండా సత్కర్మలు ఆచరించాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవ జీవిత పరమార్ధమని భారతీయ సంస్కృతి ప్రబోధం.

ఈ పురుషార్ధాలను ఇదే క్రమంలో చెప్పడంలో కూడా విజ్ఞత, విశేషత వుంది. అత్యంత ప్రాధాన్యతమైన అముష్మికంలను మొదట చివర పెట్టి, ఐహికమైన రెండింటిని మధ్యలో పెట్టారు. ఈ నాలుగింటిలో అర్ధ, కామములు ఐహికం - ఈ రెండూ స్థూలదేహంతో నశిస్తాయి. ధర్మం, మోక్షం అముష్మికం - ఈ రెండింటిలో మరణాంతరం అనుభవం లోనికి వచ్చేది మొదటిదైతే, మరణమే లేదని అనుభవస్థితికి చేర్చేది రెండవది. 
అంతేకాక, ఈ నాలుగింటిని చెప్పేవిధంలో కూడా ఓ ప్రత్యేకత వుంది. ధర్మార్ధంను ఓ జంటగా, కామమోక్షాలను ఓ జంటగా చెప్పడంలో అంతరార్ధం ఏమిటంటే -
ధర్మంతో అర్ధాన్ని సంపాదించాలని ... ఈ సంపాదన యోగిస్తుంది. అంతేకాని, కామార్ధం అంటే కామంతో అర్ధాన్ని సంపాదిస్తే అది పతనమే అవుతుంది. 

అటుపిమ్మట కొద్ది రోజుల తర్వాత రామాయణం మరోసారి చదివాను. గతంలో కొన్నిసార్లు చదివిన అవగాహనకాని కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అప్పుడప్పుడు చదివిన, విన్న రామకధ, ఈ చతుర్విధ పురుషార్ధాలు గురించి తెలుసుకున్నాక చదివినప్పుడు మార్మికత, దార్మికత, దార్శినికత అర్ధమయ్యాయి. ధర్మాచరణతో కూడిన ఆదర్శ జీవనం సాగించిన రాముడు దేముడు ఎందుకయ్యాడో అర్ధమైంది. 
'కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తారం ...' అని బాలకాండ యందు వాల్మికిమహర్షి అంటారు. కామం, అర్ధం గురించి మితంగాను, ధర్మార్ధగుణం గురించి విస్తారంగా తెలుపుతుంది రామాయణం.
ధర్మగుణంకు ప్రతీక అయిన రాముడు దేముడైతే, భక్తిపరాయణుడు అయినను కామార్ధ ప్రలోభుడయిన రావణుడు ధర్మంచే సంహరింపబడ్డాడు.

శ్రీరాముడు అవతార పురుషుడు అన్న మాటను ప్రక్కన పెట్టి, తన జీవన విధానం గమనిస్తే ఓ సామాన్య మానవునిగా ఎన్నెన్నో కష్టనష్టాలు, అపవాదులు, సుఖసంతోషాలను అనుభవించాడు. సత్కర్మాచరణలతో ధర్మం ఆచరిస్తూ, తద్వారా సక్రమార్జనతో (అర్ధంతో) సత్ కామనలతో (కోరికలతో) మనుగడ సాగిస్తూ ... నిత్య సత్య శాశ్వత ఆనంద మోక్షసిద్ధితో జీవన సాపల్యం ఎలా చేసుకోవాలో తెలియజెప్పేదే రామకధ. మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలిపేదే రామాయణం. అందుకే కదా ... ఊరు ఊరున, వాడవాడలో ... ఒక చోటని ఏముందీ? గూడు గూడులో ప్రతీ గుండెలో కొలువై, అందరి ఆరాధ్యదైవమయ్యారు నా "రాములోరు".

దశరధరాముడుగా జనించి, తొలుత అయోద్యరాముడై, పిదప సీతారాముడై, అపై కొదందరాముడై, ఆటుపై పట్టాభిరాముడై, ఆ తర్వాత ఆదర్శరాముడై, అనంతరం అందరిరాముడై, ఆఖరికి ఆత్మారాముడై విరాజిల్లుతున్నారు "నా రాములోరు".

సర్వేషు రమంతే ఇతి రామః ... అందరిలో రమించే దివ్య చైతన్యమే రాముడు.
రామ అంటే రమణీయుడు. రామనామం రమణీయం, రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్త్వం రమణీయం, రామచరితం రమణీయం, రామ మహిమ రమణీయం... ఇన్ని రమణీయాల సమాహార స్వరూపుడయిన నా రాములోరిని నిత్యం తలచేవారి మనస్సు రమణీయం, కొలిచేవారి హృదయం అత్యంత రమణీయం... ధన్యణీయం.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే//

                                     
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
                                  పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్//


రామనామ మహిమను తెలిపే పరమపావనం - రామనామం

రామాయణ అంతరార్ధం తెలిపే మోక్షపధం - రామ దర్శనం